ఐరాసతో సహా అందరితో కలిసి పనిచేస్తా-ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి బోర్డును ప్రారంభించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు-2025 వేదికగా దీనిని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు....

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి బోర్డును ప్రారంభించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు-2025 వేదికగా దీనిని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిఒక్కరు ఈ మండలిలో భాగం కావాలని , ఐరాసతో సహా అందరితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. ఇందులో శాశ్వత సభ్యత్వం పొందాలనుకునే దేశం ఒక బిలియన్ డాలర్లు (రూ.9వేల కోట్లకు పైగానే) చెల్లించాల్సి ఉంటుంది. ఈ బోర్డులో సభ్య దేశంగా పాకిస్థాన్ ఉండటం గమనార్హం. గాజా పునర్నిర్మాణాన్ని, పాలనను పర్యవేక్షించడం కోసం బోర్డును ఏర్పాటు చేస్తానని కొన్ని రోజుల క్రితం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బోర్డుకు ట్రంప్ ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఆ హోదాలో ఆయన తనకు నచ్చిన కొంత మంది సభ్యులను మాత్రమే నియమిస్తారని అందరూ భావించారు. కానీ శాంతి బోర్డులో చేరమని ఇప్పటివరకు ఆయన 50 మందికిపైగా దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వంటి దేశాధినేతలు ఉండటం గమన్హారం. ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి స్థానంలో ట్రంప్ ఈ శాంతి బోర్డును తీసుకువస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. యూఎన్వో ఎంతో చేయాల్సి ఉందన్నది, అలా చేసుంటే ఈ శాంతి మండలి అవసరమే ఉండేది కాదని ఆయన వెల్లడించారు. దీంతో ఆయన ఏర్పాటు చేసిన ఈ బోర్డు కేవలం గాజాకే పరిమితం కాదని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనేది ట్రంప్ ఉద్దేశమని విషయం స్పష్టమవుతోంది. గాజా కోసం ఏర్పాటు చేసిన శాంతి బోర్డుకు సంబంధించి ట్రంప్ ఆధ్వర్యంలో పలువురు దేశాధినేతలు సంతకాలు చేశారు. వారిలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ట్రంప్ కుదిర్చిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగానే గాజా శాంతి బోర్డును ఏర్పాటు చేశారు.
No Comment! Be the first one.