వీధి వ్యాపారులకు గుడ్న్యూస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వీధి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. వీరి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, ఇప్పుడు మరింత లాభం చేకూరేలా...


అమరావతి:
ఆంధ్రప్రదేశ్లోని వీధి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. వీరి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, ఇప్పుడు మరింత లాభం చేకూరేలా కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు కూడా క్రెడిట్ కార్డులు అందించనుంది.ఇప్పటివరకు ఉద్యోగులు, వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డులను ఇప్పుడు వీధి వ్యాపారులకు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల సహకారంతో రూ.30 వేల వరకు వినియోగించుకునే అవకాశం ఉన్న క్రెడిట్ కార్డులను జారీ చేయనుంది. ఈ కార్డులు ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో 20 నుంచి 50 రోజుల వరకు వడ్డీ లేకుండా డబ్బులు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనుంది.
తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్
ఈ పథకాన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్గా తిరుపతి జిల్లాలో అమలు చేస్తున్నారు. జిల్లాలో అర్హత పొందిన సుమారు 7 వేల మంది వీధి వ్యాపారులకు శుక్రవారం క్రెడిట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రయోగాత్మక దశ విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
పీఎం స్వనిధి ద్వారా రూ.50 వేల వరకు రుణం
వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వ పీఎం స్వనిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా మూడు విడతలుగా రుణాలు అందిస్తున్నారు. మొదటి విడతలో రూ.10 వేల రుణం మంజూరు చేస్తారు. అది సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడతలో రూ.20 వేలు, ఆ తర్వాత మూడో విడతలో రూ.50 వేల వరకు రుణం అందుబాటులోకి వస్తుంది. ఈ రుణాలను సకాలంలో చెల్లిస్తే కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. అలాగే రుణం పూర్తిగా చెల్లించిన వారికి క్రెడిట్ కార్డుల సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో అమలవుతున్న ఈ పథకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా
ఈ కొత్త చర్యలతో వీధి వ్యాపారులకు అవసరమైన సమయంలో సులభంగా నిధులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపారంలో అంతరాయం లేకుండా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల లక్ష్యమని అధికారులు తెలిపారు.
No Comment! Be the first one.