కరీంనగర్ జిల్లా కలెక్టర్కు విశిష్ట గౌరవం –ఎన్నికల నిర్వహణలో ఉత్తమ కృషికి రాష్ట్ర స్థాయి అవార్డు
కరీంనగర్ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి వేడుకల్లో కరీంనగర్ జిల్లాకు మరో విశిష్ట గౌరవం దక్కింది. ఎన్నికల నిర్వహణలో వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, శిక్షణ,...

కరీంనగర్
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి వేడుకల్లో కరీంనగర్ జిల్లాకు మరో విశిష్ట గౌరవం దక్కింది. ఎన్నికల నిర్వహణలో వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, సామర్థ్యాభివృద్ధి రంగంలో చేసిన ఉత్తమ కృషికి గాను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్ దిశా నిర్దేశంలో ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర వహించే ఎన్నికల అధికారులు, సహాయక అధికారులు, పోలింగ్ సిబ్బంది, పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడం, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టడం ఈ అవార్డుకు ప్రధాన కారణంగా నిలిచాయి. అలాగే, వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం విశేషంగా కృషి చేసింది.ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, “జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషి వల్లే ఈ అవార్డు సాధ్యమైంది” అని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్క అధికారికి అభినందనలు తెలిపారు. ఈ అవార్డు జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, సుశిక్షిత సిబ్బందితో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని అధికారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
No Comment! Be the first one.